tgoop.com/devotional/1014
Last Update:
సమయపాలన
అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్నే 'సమయం' అంటారు. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు- ఏదైనా కావచ్చు. మనిషి ప్రతి చర్యను సమయం శాసిస్తుంది. ఏ సమయంలో ఏమి చెయ్యాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నీ ప్రకృతికి అనుసంధానమై ఉన్నంతకాలం సర్వత్రా సత్ఫలితాలే లభిస్తాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానే బలిష్ఠమైన, కాలస్వరూపుడినంటాడు. యమధర్మరాజును కాలుడనీ పిలుస్తారు. మృత్యు దేవతా కాల స్వరూపమే. అది
మనిషి జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు సుఖభోగాలతోనే గడపాలనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదలి అక్రమ సంపాదనతో అపర కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప 'పరోపకార మిదమ్ శరీరమ్' అనే ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు.
శరీరంతో సుదీర్ఘకాలం జీవిస్తూ, స్వార్థానికి పెద్దపీట వేసేకన్నా, ఆదిశంకరుల్లా అల్పాయుష్షుతో జీవించినా జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరంతో చిరంజీవిగా ఉండిపోవచ్చు.
ఈ లోకంలో కి అనునిత్యం లక్షలమంది వస్తూ, మరికొన్ని లక్షలమంది నిష్క్రమిస్తున్నారు. కానీ, కాల చరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్లు మనం గ్రహించాలి. అర్థవంతంగా జీవించడమే సార్థకత.
అర్ధవంతమైన జీవితమంటే కోట్లాది రూపాయల ధనం కన్నా విలువైన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రతి మనిషీ తనకొక వ్యాపకం పెట్టుకుంటాడు.. అది వృత్తి, లలితకళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు. ఉద్యోగమూ కావచ్చు. అందులో అంకితభావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజ్ఞకు గుర్తింపు లభిస్తాయి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థులు చదువు విషయమూ అంతే. ఏ రంగాన్నికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి.
చాలా మంది తమ కృషిని గురించి తామే ఘనంగా భావిస్తారు. కొందరు ఆర్భాటంగా సందర్భం లేకపోయినా ప్రచారాలు చేసుకుంటారు. దానివల్ల అపహాస్యం పాలబడే ప్రమాదం ఉంది. ఎవరి పరీక్షా పత్రానికి వారే మార్కులు వేసుకోనట్టే, ఎవరి కృషిని వారు నిర్ణయించుకోకూడదు.
ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 'దైవనామస్మరణ' అత్యుత్తమంగా మహర్షులు చెప్పారు. నామస్మరణ చేస్తూనే నిత్యకృత్యాలు తమ చక్కబెట్టుకోవచ్చు. సద్గురు గోవిందసింగ్ 'యుద్ధంలో ఉన్నా హృదయంలో పరమాత్మను నిలుపుకోవాలి' అన్న అమృతవాక్కులు అందరికీ శిరోధార్యం. ఎందుకంటే జీవితమే ఒక యుద్ధరంగం. ఇక్కడ సమయానికి మించిన ఆయుధాలు ఉండవు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవన సాఫల్యం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1014