tgoop.com/devotional/1073
Last Update:
ఉన్నత వ్యక్తిత్వం
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు.
వ్యక్తి ప్రదర్శించే ఉద్వేగాలు, శారీరక మానసిక లక్షణాలను అనుసరించి అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉన్నత, నీచ(అధమ) వ్యక్తిత్వాలుగా భావిస్తారు. పూర్వం దేవతలు, మానవులు, రాక్షసులు వర్గాలుగా విడిపోయి జీవించేవారు. అందుకే దేవతలను దైవ దూతలని, మానవులను మానవతా మూర్తులని, రాక్షసులను దుర్మార్గులని విభజించి చూపేవారు. నేటి కాలంలో ఒకే మనిషిలో పరిస్థితులను అనుసరించి దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం తాండవిస్తున్నాయి. ఉదయం దేవుడిగా కనిపించే వ్యక్తే మధ్యాహ్నం మనిషిగా, రాత్రికి రాక్షసుడిగా ప్రవర్తించవచ్చు. ఆయా స్థితిగతులను బట్టి వ్యక్తిత్వ స్వభావాలు మారుతుంటాయి. పూర్వ యుగాల్లో దేవుడు భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేసేవాడు. నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు, సంస్కరణ. అదే ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మనిషి దేవుడిగా మారకపోయినా నష్టం లేదు కానీ రాక్షసుడిగా మారకూడదు. జీవించినంత కాలం మానవత్వంతో మనిషిగా బతికితే చాలు. క్షణక్షణం మారే స్వభావం మనిషికి సహజంగానే ఉంటుంది. సృష్టిలోని ఇతర ప్రాణులు పుట్టినప్పటి నుంచి మరణించేవరకు తమ సహజ స్వభావాన్ని మార్చుకోవు. శాకాహార జంతువు మాంసాహారిగా మారదు. ఆకలితో చావునైనా కోరుతుంది కానీ అలవాటు మార్చుకోదు. మనుషులు బుద్ధిజీవులు. తమ సంకల్ప వికల్పాలతో అభీష్టాలను, అభిప్రాయాలను మార్చుకుంటారు.
మనిషికి మంచి ఆదర్శాన్ని అందించే నిమిత్తం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు. శ్రీరాముడిగా వ్యక్తిగత, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చాడు. కొడుకు, సోదరుడు, మిత్రుడు, ప్రభువు చివరకు శత్రువుగా ఉత్తమంగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. సమాజంలో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో పాటు మంచివారికి సహకారం దుర్మార్గులకు వినాశనం తన జీవిత సందేశంగా శ్రీకృష్ణుడు అందించాడు. ఇవి అవతారమూర్తులు నేర్పిన ఉత్తమ వ్యక్తిత్వ పాఠాలు.
మనిషి మనీషిగా, దేవుడిగా ఎలా మారవచ్చో అనేక పురాణాలు చెబుతున్నాయి. అన్ని పురాణాల్లో అత్యుత్తమమైందిగా నారదుడు కీర్తించిన భాగవతంలోని అన్ని కథలు, పద్యాలు- నైతిక, ధార్మిక, మానవతా విలువల గురించే బోధించాయి.
చేతులతో శివుడి పూజ(సమాజ సేవే శివ పూజ), నోరారా హరినామ సంకీర్తన, దయ, సత్యం మనసారా తలచుకోలేనివారు తల్లులకు కడుపు చేటు అని భాగవత పద్యం చెబుతుంది. భాగవతుల కథలన్నీ మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే ప్రక్రియలే.
మహాపురుషులు ప్రబోధించిన వ్యక్తిత్వ వికాస సిద్ధాంతాలు వారు నమ్మి ఆచరించిన ఉన్నత విలువలు. దయ, సత్యంతో కూడిన బుద్ధుడి బోధనలు, నిలువెత్తు ప్రేమ స్వరూపం జీసస్, సహనానికి ప్రతీక మహమ్మద్ ప్రవక్త, అహింసే పరమ ధర్మంగా ఆచరించిన గాంధీ మహాత్ముడు... అందరూ అనుసరణీయులే.
కాలువ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ప్రాణ భయంతో ఉన్న తేలును అది కాటు వేస్తున్నా చేతితో తీసి రక్షించే సాధువు కథ ఆదర్శవంతం. తేలు సహజ గుణం కాటు వేయడం, మనిషి సహజ గుణం కాపాడటం. ఉపకారికి ప్రత్యుపకారం గొప్ప కాదు. తనకు అపకారం చేసినా తాను వారికి మేలు చేయడం దైవత్వ లక్షణం. మనిషిని దేవుడిగా పూజించే స్థాయికి చేరకున్నా కనీసం తాను మనిషిగా జీవిస్తే చాలు. అదే ఉన్నతమైన వ్యక్తిత్వ పరిపూర్ణ జీవితం. సమాజానికి వెలుగు నింపే ఉజ్జ్వల కాంతి కిరణం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1073