tgoop.com/devotional/1082
Last Update:
మోహముద్గరం
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది.
మోహముద్గరం అంటే అజ్ఞానానికి అడ్డుకట్ట అని అర్థం. మానవ జీవితం కామక్రోధాది ఆరు చెడ్డ గుణాలకు నిలయం. నాది, నాకు, నేను అనే ఆలోచనే పై దుర్గుణాలకు, వాటిద్వారా అనేక అనర్థాలకు కారణమవుతోంది. ఆ ఒక్క ఆలోచనను విడిచిపెడితే మనసు ప్రశాంతత పొందుతుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టించడానికి మార్గంగా ఆది శంకరాచార్యులు ‘భజగోవిందం’ అనే శ్లోకంతో ప్రారంభించి 31 శ్లోకాలలో విశదీకరించారు. అవి ‘మోహముద్గరం’ పేరుతో ప్రసిద్ధి చెందాయి.
మనిషి... స్థిరం, శాశ్వతం అనుకునే, పొందడానికి ఆత్రపడే విషయాల అసలు స్వరూపాన్ని, వాటిలోని ఇబ్బందులు, లోపాలు, కష్టాలు, బాధలను ఈ శ్లోకాల్లో అత్యంత సరళంగా విడమరచి చెప్పారాయన.
ఒక వ్యాకరణ పండితుణ్ని ఉద్దేశించి చెబుతున్నట్టు మొదలుపెట్టి, సామాన్య జనానికి అర్థమయ్యేటంత సరళంగా చెప్పారు. మానవుడు ఎంతవరకు ధనం సంపాదించగలడో అంతవరకే కుటుంబం, బంధువులు అతడిపట్ల ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణం పోయిన మృతదేహాన్ని భార్య సైతం అసహ్యించుకుంటుంది. నీవు సర్వస్వం అనుకునే ధనం వల్ల ఇసుమంతైనా సుఖం ఉండదు. కాబట్టి భార్య, బిడ్డలు నీవారు అనే భావం విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరూ ఎవరికీ ఏమీకారు అని చెబుతూ... వాటిని ఎలా విడిచి పెట్టాలో ఆ మార్గాన్నీ సూచించారు.
వస్తువులు, విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతాం అనుకోవడమే మోహం, భ్రమ. ఈ లోకంలో ఏ వస్తువు, ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనం దాన్నే ఇస్తాయన్న నమ్మకం లేదు. వస్తువు పోయినా, చెడిపోయినా అప్పుడు కలిగేది దుఃఖమే అంటూ అనేక ఉదాహరణలు, సంఘటనలు నిర్మొహమాటంగా చెప్పి మోహనాశాన్ని కలిగించే ప్రయత్నం చేశారు.
నిజానికి పదమూడు శ్లోకాల వరకు శంకరాచార్యులవారు సున్నితంగా హితబోధ చేశారు. ఆయన సున్నితంగా చెప్పిన విషయాలతో జనంలో మార్పు రావడం కష్టమని, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలని ఆయన శిష్యులు భావించారు. ఆ ఆలోచనకు కార్యరూపమిస్తూ... వీరిలో పన్నెండు మంది ఒక్కొక్కటి చొప్పున, మరొక శిష్యుడు అయిదు, వెరసి పద్దెనిమిది శ్లోకాలను చెప్పారు. శంకరులు చెప్పినట్టే ప్రచారంలో ఉన్నా వాటికి, వీటికీ చెప్పే తీరులో చాలా తేడా ఉంటుంది.
‘పవిత్ర నదుల్లో స్నానం ఆచరించినప్పటికి, వ్రతాలు-దానాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే నూరు జన్మలెత్తినా మోక్షం రాదు’ అని నిక్కచ్చిగా చెప్పాడు సురేశ్వరాచార్యుడనే శిష్యుడు.
జగత్తు నశ్వరత్వాన్ని తెలుపుతూ అవసరం వచ్చినప్పుడు నువ్వు ‘నావి’ అని కౌగిలించుకొంటున్న ధనం, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయంలో నీ వెంట రావు. నిన్ను ఉద్ధరించవు’ అని మరో శిష్యుడైన సుమతాచార్యులు నిర్మొహమాటంగా చెప్పాడు.
ఇలా పదమూడు మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తీరు. అందుకే చివరి పద్దెనిమిది శ్లోకాలూ కాస్త కటువుగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, సూటిగానే ఉంటాయి. గురుశిష్యుల్లో ఎవరు చెప్పినా చివరకు ‘భగవంతుడు ఒక్కడే సత్యం, నిత్యం. అందుచేత అతణ్నే భజించు’ అంటూ వివరిస్తూ మోహానికి అడ్డుకట్ట వేసి, జీవన్ముక్త స్థితిని పొందే మార్గం తెలియజేశారు.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1082