tgoop.com/devotional/1086
Last Update:
ఎన్నో విశేషాల అద్భుత పర్వం
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలాన్ని అత్యంత పుణ్యప్రదంగా సనాతన ధర్మశాస్త్రాలు అభివర్ణించాయి. ఉత్తరాయణంలో వచ్చే ఈ పుణ్యకాలాన్ని మహాపర్వంగా పరిగణించి, శ్రోత్రియులు మొదలుకొని సామాన్యులవరకు అందరూ మహోత్సాహంగా జరుపుకొంటారు. భారతదేశమంతా ఈ పండుగకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంలో నిర్వర్తిస్తారు. ఈ సంక్రమణకాలం మహిమాన్వితమని చెప్పిన ఋషుల ప్రతిపాదనను అనుసరించి, ఆ పుణ్యకాలంలో స్నాన, దాన, అర్చన, పితృతర్పణలను ఆచరించే పద్ధతులున్నాయి. ఉత్తరాదిలో గంగానదిలో, విశేషించి ప్రయాగ వద్ద స్నానానికి ప్రాము ఖ్యాన్నిస్తూ అధిక సంఖ్యలో శ్రద్ధాళువులు హాజరై, తీరంలో దేవతలను, పితృదేవతలను ఆరాధిస్తారు.
నింగిలో సూర్యుడి శక్తియే కాంతిగా, వర్షంగా, శక్తిగా భూమిపై కురిసి ప్రాణ చేతనను, పంటను కూడా జీవకోటికి ప్రసాదిస్తుంది. ఈ సంక్రమణల నుంచి చలి తగ్గుతూ, సూర్యకాంతి క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
పంటలు చేతికంది భోగాన్ని
ప్రసాదిస్తాయి కనుక 'భోగి' సంబరాన్ని
జరుపుకొని, సంక్రాంతిని పవిత్రకర్మలతో
సార్ధకం చేసుకోవడం ఆనవాయితీ.
వేదశాస్త్ర ప్రకారం కొత్తపంటగా వచ్చిన బియ్యాన్ని దేవతలకు నివేదించి తరవాత తాము స్వీకరించాలని 'ఆగ్రయణం' అనే పేరుతో క్రతువు నిర్వహిస్తారు. అగ్నిహోత్రంలో హవ్యంగా ధాన్యాన్ని సమర్పించడం ఇందులో ప్రధానాంశం. ఆ అగ్నిహోత్రుడు సూర్యభగవానుడి మరో రూపం, ప్రతీక! ఇదే యజ్ఞాన్ని సామాన్యులు కూడా, సూర్యకాంతి పడేలా పాలతో బియ్యాన్ని ఉడికించి 'పొంగల్'గా భగవానుడికి నివేదించే ఆచారంగా ఏర్పరచారు.
సూర్యుడికి సంకేతంగా గాలిపటాలను ఎగురవేయడం కొన్నిచోట్ల సంప్రదాయం. 'పతంగ' అనే పేరు సూర్యుడిదే. సంక్రాంతివేళ పితృదేవతలకు తర్పణాలు వదలడాన్ని విధిగా చెబుతారు. తిలలతో(నువ్వులతో) వంటలు, ప్రసాదాలు, దానాలు; హోమాలు చేయాలని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ''తిలసంక్రాంతి' అని కొన్నిచోట్ల ఈ పండుగకు మరోపేరు ఉంది. దేవతా పూజకు తెల్లనువ్వులు, పితృదేవతలకు నల్లనువ్వులు వినియోగిస్తారు.
ఈ రవి సంక్రాంతినాడు అభ్యంగ స్నానం తప్పనిసరి అని, అది గొప్ప సత్ఫలితాలనిస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి, విష్ణు, శివ, శక్తి- వంటి దేవతలను ఆయా భక్తులు ఈ రోజున ప్రత్యేకించి పూజించి విశిష్ట ఫలాలు పొందవచ్చని ఆయా దేవతారాధన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నువ్వులనూనెతో దీపాలు, నువ్వుల వంటల నివేదనలను ముఖ్యంగా నిర్దేశించాయి. ఆవుపాలతో అభిషేకం, తెల్లనువ్వులు బియ్యం కలిపిన అక్షతలతో పూజ- శివుడికి ప్రీతి అని ధార్మికోక్తి. నేల తల్లి ఇచ్చిన పంటలకు సంతోషిస్తూ, ఆ ఫలాలను దానాలుగా, కానుకలుగా, బహుమానాలుగా, దేవతార్పణలుగా పంచుకొనే పండుగ ఇది. వ్యక్తి కృషితో పాటు సాటి వ్యక్తుల సహకారం, ప్రకృతి అనుకూలత, పశువుల తోడ్పాటు, సూర్యాది దివ్యశక్తుల అనుగ్రహం... ఇవన్నీ కలిసి లభించిన సంపదను కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించుకుంటూ సంతోషించే దివ్యపర్వమిది.
ఆధ్యాత్మిక- ధార్మిక ప్రాధాన్యంతో పాటు, సాంస్కృతికపరంగా, సామాజికంగా కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ 'పెద్దపండుగ' అందరికీ ఆనందోత్సవాలను ప్రసాదించాలని వివిధ సంప్రదాయాల ఆంతర్యం.
BY Devotional Telugu
Share with your friend now:
tgoop.com/devotional/1086